మేము 18 గంటలు కష్టపడుతుంటే.. హరీష్ రావు అబద్ధాలు చెబుతున్నారు: భట్టి విక్రమార్క

  • రాష్ట్ర కేబినెట్ రోజుకు 18 గంటలు ప్రజల కోసం పనిచేస్తోందన్న భట్టి
  • బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని దివాలా తీయించిందని మండిపాటు
  • తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 76 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని వెల్లడి

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీఆర్ఎస్ నాయకులపై, ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వరంగల్ జిల్లా చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తుంటే... హరీష్ రావు మాత్రం అబద్ధాలు ప్రచారం చేయడంలో బిజీగా ఉన్నారని మండిపడ్డారు. "రాష్ట్ర క్యాబినెట్ రోజుకు 18 గంటలు ప్రజల కోసం పనిచేస్తుంటే.. హరీష్ రావు నిత్యం అబద్ధాలు చెబుతున్నారు" అని భట్టి విమర్శించారు.


పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని దోచుకుని, దివాలా తీయించిందని ఆయన ఆరోపించారు. మరి నాడు అధికారంలో ఉన్నప్పుడు పేదలకు సన్నబియ్యం ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వ విజయాలను ఆయన పంచుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది కాలంలోనే 76,000 ప్రభుత్వ ఉద్యోగాలు అందించిందని, రైతులకు అండగా నిలుస్తూ తడిసిన, దెబ్బతిన్న ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తోందని తెలిపారు. అలాగే రుణమాఫీ పథకాన్ని నిలకడగా అమలు చేస్తున్నామని చెప్పారు.


బీఆర్ఎస్ హయాంలో నిర్లక్ష్యానికి గురైన దేవాదుల ప్రాజెక్టును తాము వేగవంతం చేశామన్నారు. గత ప్రభుత్వం డిస్కమ్‌లకు బకాయిలు పెట్టడం వల్లే విద్యుత్ సమస్యలు వచ్చాయని, తాము ఆ బకాయిలను చెల్లిస్తూ విద్యుత్ సరఫరాను మెరుగుపరిచామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో నెరవేరుస్తున్నామని చెప్పారు. రఘునాథపల్లిలో 230 కేవీ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.


Bhatti Vikramarka
Harish Rao
Telangana Congress Government
BRS Party
Telangana Government Jobs
Telangana Power Projects

More Telugu News